Friday, June 25, 2010

హిందూధర్మము -

భారతీయ బాలబాలికలకూ, యువతీ యువకులకూ, మన సనాతనధర్మంపట్ల ఆ సనాతన ప్రవచించే వేదపురాణ శాస్త్ర కావ్యవాజ్ఞయంపట్ల ఆసక్తి పెంచటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రయత్నం లో ఓ భాగం


వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, స్మృతులు, ఇతిహాసములు

వేదములు

హిందూధర్మమునకు వేదములే మూలము.వేదము భగవంతుని వచనమే. ప్రపంచ సాహిత్యములో వేదములకంటే ప్రాచీనమైన సాహిత్యము మరొకటిలేదు. అత్యంత పురాతనమైన వైదిక సంస్కృతములో వేదములు రచింపడినవి.

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని వేదములు నాలుగు. ఒక్కొక్క వేదము కర్మకాండ అనియు, జ్ఞానకాండయనియు రెండుగా విభజింపబడినది. కర్మకాండములో యజ్ఞాదికర్మలు వివరింపబడినవి. జ్ఞానకాండములో బ్రహ్మతత్త్వము నిరూపింపబడినది.

ఒక్క పరబ్రహ్మను తెలిసికొన్నచో తక్కిన సమస్తమును తెలిసికొన్నట్లే. కావున బ్రహ్మ స్వరూపములు నిరూపించు వేదభాగము మిక్కిలి ముఖ్యమైనది. దీనినే వేదాంతము, లేదా ఉపనిషత్తులు అని పిలుతురు.

మంత్రద్రష్టలైన ఋషులు మొదట వేదముల నుచ్చరించిరి. వారు వేదములకు ద్రష్టలేకాని కర్తలు కారు. కావుననే వేదములు అపౌరుషేయము లనియు, నిత్యము లనియు చెప్పడినవి.

వేదవ్యాసుడు ఈ వేదములను నాలుగుగా విభజించి తన శిష్యులగు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనువారికి బోధించెను. పిమ్మట వారు గుర శిష్య పరంపరగా వదములు ఒక తరము నుండి కరొక తరమునకు సంక్రమిచుచు వచ్చినవి.

మానవులు భ్రమప్రమాదములకు లోనగుట సహజము. అందుచే వారి మాటలలో తప్పులు దొరలుట కవకాశము గలదు. వేదములు అపౌరుషేయములు గాన నిర్దుష్టములై యున్నవి.

ఉపనిషత్తులు

వేదములుయొక్క చివరిభాగములే ఉపనిషత్తులు. వేదశాఖలు అనేకములు గావున ఉపనిషత్తులు గూడ అనేకములు గలవు. అందు ౧౦౮ ఉపనిషత్తులు ముఖ్యములు. అందును పది ఉపనిషత్తులు మిక్కిలి ప్రధానములై యున్నవి.

ఈశ కేన కఫ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా.

౧. ఈశావాస్యోపనిషత్తు ౨.కేనోపనిషత్తు ౩. కఠోపనిషత్తు ౪. ప్రశ్నోపనిషత్తు ౫. ముండకోపనిషత్తు ౬ మాండూక్యోపనిషత్తు ౭ తైత్తిరీయోపనిషత్తు ౮ ఐతరేయోపనిషత్తు ౯ ఛాందోగ్యోపనిషత్తు మరియు ౧౦. బృహదారణ్యకోపనిషత్తు - అనునవి దశోపనిషత్తులు.

వేదాంతసంప్రదాయములో దశోపనిషత్తులు పరమప్రమాణములు గావున ఆచార్యాలు తత్త్వమును ప్రతిపాందిచునుపుడు మాటిమాటికి ఉపనిషత్తుల నుదాహరించిరి. ఉపనిషత్తులలోని సిద్ధాంములే సంగ్రహముగా భగవద్గీతయందును, బ్రహ్మసూత్రములలోను వివరింపబడినవి.

వేదాంగములు
శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా,
కల్పశ్చేతి షడంగాని వేదస్యాహు ర్మనీషిణః

౧.శిక్ష ౨. వ్యాకరణము ౩. ఛందస్సు ౪.నిరక్తము ౫.జ్యోతిషము ౬.కల్పము అనునవి యారును వేదమునకు అంగముజగుచున్నవి. వేదార్థమును తెలిసికొనుట కివి మిక్కిలి యుపకరించును.

శిక్ష

పాణిని శిక్షాశాస్త్రమును రచించెను. ఇది వేదముము ఉచ్చరింపవలసిన పద్ధతిని బోధించును. వేదములలో స్వరము మిక్కిలి ముఖ్యము. స్వరమును గూర్చిన విశేషములన్నియు ఈ శాస్త్రములో చక్కగా నిరూపింపబడినవి.

వ్యాకరణము

వ్యాకరణశాస్త్రమును గూడ సూత్రరూపమున పాణినియే రచించెను. ఇందు ఎనిమిది అధ్యాయములు కలవు. ఈమహాశాస్త్రమును మహేశ్వరుని అనుగ్రహముతో ఆయన రచించెనని చెప్పుదురు. దోష రహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమము లన్నియు ఈ శాస్త్రములో విశదీకరింపబడినవి. పాణిని వ్యాకరణసూత్రములే ఆధునికి భాషాశాస్త్రమునకు మూల మని భాషాశాస్త్రవేత్తలు చెప్పుదురు.

ఛందస్సు

పింగళుడు "ఛందోవిచితి" అనబడు ఎనిమిది అధ్యాయముల ఛందశ్శాస్త్రమును రచించెను. వేదమంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక లౌకికఛందస్సులు గూడ ఇచట నిరూపింపబడినవి.


నిరుక్తము

నిరుక్తశాస్త్రమునకు కర్త యాస్కుడు. వేదమంత్రములలోని పదముల యొక్క వ్యుత్పత్తి ఇందు బోధింపబడినది. వేదార్థమును గ్రహించుట కీ శాస్త్రము మిక్కిలి ఉపయోగపడుచున్నది. పదములన్నియు ధాతువు నుండి పుట్టిన వని యాస్కుని అభిప్రాయము.

జ్యోతిషము

వేదములు యజ్ఞములు చేయవలయునని బోధించుచున్నవి. నియత కాలములందే ఆ యజ్ఞములను చేయవలెను. ఆ కాలనియమమును బోధించు శాస్త్రమును 'జ్యోతిష' మందురు. లగధుడు, గర్గుడు మున్నగువా రీ శాస్త్రగ్రంథములను రచించిరి.


కల్పము

సూత్రరూపమున నున్న కల్పశాస్త్రము యజ్ఞయాగాదుల విధానములను, అందలి భేదములను వివరించుచున్నది. ఆశ్వలాయనుడు, సాంఖ్యాయనుడు మున్నగువారీ శాస్త్రమును ప్రవర్తిపజేసిరి.

No comments:

Post a Comment