Wednesday, December 8, 2010

భరణి-పరికిణి-ఇంకో మూడు

భరణి కవితా పటిమకి ఓ మూడు మచ్చుతునకలు..
పరికిణి సంకలనం నుండి

మా ఆవిడకి మంత్రాలొచ్చు
--------------------------
ఏడ్చే పసివాడికి
పాలసీసా అయిపోతుంది
అత్తగారి నడ్డికింద
పీటై పోతుంది ...
మావగారికి కాఫీ
ఫ్లాస్కయి పోతుంది...
రాత్రి పడగ్గదిలో
నాకు - రగ్గయిపోతుంది
ప్రొద్దున్నే వాకిట్లో
ముగ్గై పోతుంది
మా ఆవిడకి మంత్రాలొచ్చు
(వుమెన్స్ లిబ్ వాళ్ళు కాకినాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో
ఆశువుగా చెప్పినది! ... ఇది మా శ్రీమతికి అంకితం ...
చిలక ప్రశ్న
--------------
ఎలక్కి బోనూ
చిలక్కి పంజరం
ఎద్దుకు కాడీ
సింహాలకి జూలూ ... (zooలూ)
కుక్కలకి గొలుసూ
చేపలకి పులుసూ ...
అంటే ఈ భూగోళం మొత్తం
మనిషి అబ్బ సొమ్మా!
పిల్లాడికి జ్వరమొస్తే
కోడిపుంజుకు చవా?
ఊళ్ళో కరువొస్తే
మేకల మెడ నరకాలా?
ఈ భూమ్మీద
పండు పుట్టింది
పిట్ట కోసం కాదా?
పండూ - పిట్టా
రెండూ నీకేనా?
ఏనుగు దంతంతో
బుద్ధుడి బొమ్మా?
ఎద్దు కొమ్ముతో
ఏసుక్రీస్తా?
సర్లే!
పులితోలు నీ దేవుడి డ్రస్సూ!
జింకతోలు మీద కూర్చుని
వాడికోసం - నీ తపస్సూ!!
(ఈ కవిత బ్లూ క్రాస్ సొసైటీ ... అక్కినేని అమలాగార్కి అంకితం)
బిందు స్వరూపిణి
----------------
కళ్ళిచ్చి వాడు
వొట్టి చూపే ఇస్తే
ఆ దేవుణ్ణి నేను శపించే వాణ్ణి!
వాడు మంచాడు
అందుకే ... కన్నీరిచ్చాడు!!
కన్నీటి బిందువుని
మించిన కావ్యం
నాకు కనపళ్ళేదు
రుద్రుడు కరుణా సముద్రుడు
గంగని భగీరధుడికీ
కన్నీటి బొట్లను భారతావనికీ
ఇచ్చాడు!!
కన్నీటి బొట్టు పుటక తెలిస్తే
గుండె చెరువౌతుంది
అది సముద్రంలో కలిస్తే
మనసు తేలికౌతుంది
సృష్టికర్త
పగటి కన్నీటి బొట్టు పేరు
సూర్యుడు..
రాత్రి అశ్రుబిందువు పేరు చంద్రుడూ...
మధ్యలో ఉండే ఏడుపు పేరే..
మనిషి !!!
(చాలాసార్లు నాకు కన్నీళ్ళొచ్చాక ... బాధ కన్నా
... ఆనందమే కలిగింది మరి ...)