Monday, July 12, 2010

నల్లనివాడు పద్మనయనంబులవాడు

గోపికలు శ్రీకృష్ణుని వెదకుచు బృందావనములోని తరులతాపుష్పములను ఉద్దేశించి చెప్పిన పద్యములలో ఈ క్రింది పద్యము సుప్రసిద్ధమైనది. తెలుగుపై అభిమానమున్నవారు కంఠస్థము చేయవలసిన పద్యములలో ఇది ఒకటి.

నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళిపరిసర్హితపించమువాడు నవ్వు రా-
జిల్లెడుమోమువాడొకడు చెల్వలమానధనంబు దెచ్చె నో
మల్లియలార మీపొదలమాటున లేడు గదమ్మ చెప్పరే

కాని ఇట్టి పద్యమే మఱొకటి భాగవతములో నవమస్కంధములో నున్నది. అది శ్రీరాముని సంబోధించినది. ఆ పద్యము-
నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులన్
విల్లును దాల్చువాడు గడు విప్పగు వక్షమువాడు మేలు పై
జల్లెడువాడు నిక్కినభుజంబులవాడు యశంబు దిక్కులం
జల్లెడువాడు నైన రఘుసత్తము డిచ్చుట మా కభీష్టముల్

No comments:

Post a Comment