Thursday, March 25, 2010

వేటూరి!


ఆ తరువాత వచ్చిన కవులు, మాటల కవులు పాటల కవులు గా విడివడి రచనలు సాగించడం మొదలయ్యింది. అదే సమయంలో తెలుగు సినిమాకు చిలకపచ్చ చీర కట్టి, తరువాత్తరువాత ఆ చీరకొంగే లాగి చిలిపి ఆటలు ఆడిన ఉద్దండపిండం, కొంటెకోదండం ఒకాయన రంగప్రవేశం చేశారు.
ఆయనే వేటూరి!
తొలుత దైతాగోపాలం గారివద్ద, ఆ తర్వాత మల్లాది గారి వద్ద శిష్యరికం చేసి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు తీయించారు శ్రీ వేటూరి గారు.
సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణసాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి కొండొకచో సంగ్రహించి అందమైన పాటల్ని అలవోకగా రచించడంలో ఆయన అసాధ్యుడు. వేటూరి అనగానే వెంటనే స్ఫురించేది అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, ఇలా ఎన్నో సినిమాలు! “పిల్లనగ్రోవికి నిలువెల్లగాయాలు, అల్లన మ్రోవిని తాకితే గేయాలు” “నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ”, “ఉఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు; స్పందించు నవనాడులే వీణాగానాలు; నడలు ఎదలోని సడులే మృదంగాలు” ఇలాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. గీతరచనకు కేంద్ర ప్రభుత్వం చేత అవార్డును పొందిన ఏకైక తెలుగు సినిమాకవి ఆయన. సీతారామశాస్త్రి వచ్చేవరకూ వేటూరిది దాదాపు ఏకచత్రాధిపత్యం అనే చెప్పుకోవచ్చు.
ఆల్కెమీ అంటే రసవాదం లేదా పరుసవేది. అంటే కొన్ని సాధారణమైన వస్తువుల కలయికతో బంగారాన్ని పుట్టించడం. ఏది ఇంగిలీకమో, ఏది పాదరసమో, ఏది వెలిగారమో, ఏది పాముకుబుసమో, ఎరిగి, సమపాళ్ళలో కలిపి, స్వర్ణతుల్యమైన పాటల్ని ఒడుపుగా పుట్టించిన చెంబోలు సీతారామశాస్త్రి ఒక్క సినిమాతో సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడిపోయారు. ఉదాత్తమైన భావాలూ శక్తివంతమైన పదాల్తో సున్నితమైన సులభగ్రాహ్యమైన పాటల్ని వ్రాయడంలో ఆయనకాయనే సాటి.
వీళ్ళు మాత్రమే కాక “కురిసింది వాన నా గుండెలోన” అంటూ రాజశ్రీ, “తనువా హరిచందనమే” అంటూ విజయరత్నం, “ఓహో గులాబిబాల” అని అనిశెట్టి, “నిదురపోరా తమ్ముడా” అని పినిశెట్టి, “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అని గుంటూరు శేషేంద్ర శర్మ ఇంకా వీటూరి, మల్లెమాల, కాటూరి, జాలాది, దాసం గోపాలకృష్ణ, దాసరి నారాయణ రావు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, సామవేదం షణ్ముఖ శర్మ, భువన చంద్ర, చంద్రబోస్‌, గురుచరణ్‌ ఇలా ఎందరో శబ్ద స్రష్ఠలు తెలుగు పాటను పెంచి పోషిస్తూన్న పద పరబ్రహ్మలు.
సినిమా సంగీతానికున్న (వుండాల్సిన) ఒకే ఒక్క గుణం సౌలభ్యం. ఏనాటికీ చెడని సౌలభ్యం. వి.ఎ.కె.రంగారావు గారి మాటల్లో చెప్పాలంటే “దారిని పోయే దానయ్యను సైతం గానయ్యను చేసే” సౌలభ్యం. పాట సాహిత్యం విన్న వెంటనే అర్ధం అయినా కాకపోయినా, సంగీతానికి అనుగుణంగా దాని పదసంచారం ఉన్నంతకాలం, తెలుగు శ్రోతలు వుంటూనేవుంటారు వింటూనేవుంటారు.

No comments:

Post a Comment